ఈ ఏడాది హైదరాబాద్‌లో 2 శాతం నేరాలు పెరిగాయిః సీపీ శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక విడుదల

cp-srinivas-reddy-release-hyderabad-annual-crime-report

హైదరాబాద్‌ః హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సీపీ శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది 2 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. స్థిరాస్తి నేరాలు 3 శాతం పెరిగాయని చెప్పారు. మరోవైపు ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలపై రేప్ కేసులు ఈ ఏడాది 403 నమోదయ్యాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గతేడాది సైబర్ నేరాల్లో ఈ ఏడాది రూ.133 కోట్లు కాజేశారని.. 2022 లో 292 కేసులు నమోదు కాగా 2023 లో 344 కేసులు వచ్చాయని వివరించారు.

డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తుందని హైదరాబాద్ సీపీ అన్నారు. సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా వెతికిమరి పట్టుకుంటామని చెప్పారు. డ్రగ్స్‌ను గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్‌ను వినియోగిస్తామని వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలు రాత్రి 1 లోపు ఆపివేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బులు, బార్‌లలో డ్రగ్స్ ఉన్నాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.