గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ఈ మధ్య ఎక్కువ సంఖ్యలో గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా గుండెపోటు వస్తుంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సతీష్ కౌశిక్ గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

కమెడియన్‌గా పలు సినిమాల్లో నటించిన సతీష్ (66) నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశారు. ఇక దర్శకుడిగా ‘రూప్ కీ రాణి చోరోన్ కా రాజా, ప్రేమ్, హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై, తేరే నామ్, కాగజ్’ వంటి చిత్రాలను రూపొందించారు. ఇక ఆయన ‘దీవానా మస్తానా, బ్రిక్ లేన్, రామ్ లఖన్, సాజన్ చలే ససురల్, కాగజ్, ఛత్రివాలి’ తదితర చిత్రాల్లో నటించగా.. ‘మిస్టర్ ఇండియా’లో చేసిన క్యాలెండర్ పాత్ర బాగా పాపులర్ అయింది.

ప్రియ స్నేహితుడు సతీష్ మరణం పట్ల నటుడు అనుపమ్ ఖేర్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ‘ఈ ప్రపంచంలోని అంతిమ సత్యం మరణమే అని నాకు తెలుసు. కానీ నేను బతికుండగా.. నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ కౌశిక్ గురించి ఇలా రాస్తానని కలలో కూడా అనుకోలేదు. 45 ఏళ్ల స్నేహానికి ఇంత సడన్‌గా ఫుల్ స్టాప్ పడుతుందనుకోలేదు!! నువ్వు లేకుండా ఈ జీవితం మునుపటిలా ఉండదు సతీష్! ఓం శాంతి!’ అని పోస్టులో పేర్కొన్నారు.

సతీశ్‌ కౌశిక్‌ 1956, ఏప్రిల్‌ 13న హర్యానాలోని మహేంద్రగఢ్‌లో జన్మించారు. 1983లో వచ్చిన ‘మాసూమ్‌’ సినిమాతో చిత్రపరిశ్రమలో జర్నీ ప్రారంభించారు. ఇప్పటివరకు వందకు పైగా సినిమాలకు పనిచేశారు. 1990లో రామ్‌ లఖన్‌, 1997లో సాజన్‌ చలే ససురాల్‌ సినిమాలకుగాను ఫిల్మ్‌ఫేర్‌ (ఉత్తమ హాస్యనటుడు) అవార్డు అందుకున్నారు.