వృద్ధుడి ఆత్మహుతి ఘటన ఫై సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్
సిద్దిపేట జిల్లాలో కుమారులు తనను వంతులవారీగా పోషించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ వృద్ధుడు (90) తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసింది. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. వృద్ధుడి ఆత్మహుతి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ ట్విట్టర్లో ఎమోషనల్ అయ్యారు.
ఈ ఘటన అత్యంత బాధాకరమన్నారు. వంతుల వారీగా తండ్రిని పంచుకోవాలని కన్న కొడుకులు నిర్ణయించడం దారుణమన్నారు. తల్లిదండ్రులు భారమనే భావన పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదన్నారు. కంటికి రెప్పలా సాది.. తమ కాళ్లపై నిలబడేలా తీర్చి దిద్దిన తల్లిదండ్రులను పోషించే స్థితిలో కొందరు కొడుకులు లేకపోవడం దురదృష్ణకరమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో ఈ ఘటన జరిగింది.
పొట్లపల్లికి చెందిన మెడబోయిన వెంకటయ్య(90) నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఐదుగురికి పెళ్లిళ్లు చేశాడు. అయితే కొన్నేండ్ల క్రితమే వెంకటయ్య భార్య చనిపోయింది. ఈ నలుగురు కుమారులు కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. 5 నెలల క్రితం వెంకటయ్య పోషణపై కుమారుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో తండ్రి వెంకటయ్యను ఎవరు పోషించాలన్న దానిపై పొట్లపల్లిలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. నెలకు ఒకరు చొప్పున నలుగురు కుమారులు వంతులవారీగా తండ్రి వెంకటయ్యను పోషించాలని పెద్దమనుషులు నిర్ణయించారు. కొడుకులు తనను వంతుల వారీగా పంచుకోవడాన్ని తట్టుకోలేని వెంకటయ్య మే 3వ తేదీన తాటి కమ్మలను ఒక చోట కుప్పగా పేర్చుకుని వాటికి నిప్పంటించి, అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.