ఖమ్మం జిల్లా కొణిజర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ధ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం పెట్రోల్‌బంకు ఎదురుగా లారీ – కారు పరస్పరం ఢీ కొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్ర గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

మృతులు పారుపల్లి రాజేష్ సుజాత దంపతులు, వారి కుమారుడు అశ్విత్ (13) గా గుర్తించారు. వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన వారిగా సమాచారం. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో రాజేష్ ఉద్యోగి. హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.