కర్ణాటకలో ఘోర కారు ప్రమాదం : 10 మంది ఒకే కుటుంబ సభ్యులు మృతి

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీ కి చెందిన 10 మంది మృతి చెందారు. తిరుమకుడాలు, నరసిపురా మధ్య ఈ ప్రమాదం జరిగింది. బళ్లారి నుంచి మైసూరు సందర్శనకు ఇన్నోవా వాహనంలో వెళ్తుండగా.. వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది.

దాంతో ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే 10 మంది మృతి చెందారు. స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బస్సు ఢీకొట్టడంతో నుజ్జయిన కారులో చిక్కుకున్న కొందరు క్షతగాత్రులను వెలికితీసి చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తమ ప్రాథమిక విచారణలో తేలిందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.