నేడు అసెంబ్లీ రెండో రోజు.. సీఎం రేవంత్ ప్రసంగం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు రెండో రోజు కొనసాగనున్నాయి. నిన్న తొలిరోజు గవర్నర్ తమిళసై ప్రసంగించారు. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. దానిని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బలపరుస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చర్చలో పాల్గొంటారు. అదేవిధంగా మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మరో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ దానిని బలపర్చనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ తమిళిసై గురువారం ప్రసంగించిన విషయం తెలిసిందే. కాగా, నేడు మంత్రి మండలి సమావేశం కానున్నది. ఈ సందర్భంగా ఓటాన్ బడ్జెట్ అకౌంట్ పద్దులను క్యాబినెట్ ఆమోదింనుంది. ఇక రేపు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు.