సిఎం కెసిఆర్‌కు మరో బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy wrote another open letter to CM KCR

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడే ఎరువులను వందకు వంద శాతం ఉచితంగా సరఫరా చేస్తామని 2017 ఏప్రిల్‌ 13న ప్రగతి భవన్‌ సాక్షిగా మీరు రైతులకు ఇచ్చిన మాట. అన్ని హామీలు మాదిరిగానే ఈ మాటకు దిక్కు లేకుండా పోయిందని లేఖలోవివరించారు. ఆరు నూరు అవుతుందేమో కానీ మీరు మాట మీద నిలబడడు అని మరో సారి నిరూపితమైంది. ఉచిత ఎరువులు అని రెైతుల చెవిలో మీరు పెట్టిన గులాబీ పూలు అలాగే ఉన్నాయంటూ విమర్శలు చేశారు.

కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఉచిత ఎరువులు సంగతేమో కానీ, పైసలిచ్చి కొందామనుకున్న ఎరువులు దొరక్క అల్లాడే పరిస్థితి రైతులది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కోఆపరేటివ్ సొసైటీలు, వ్యవసాయ సహకార సంఘం ఆఫీసుల వద్ద ఉదయం నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారని ఆగ్రహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది.

వానాకాలం వరి నాట్లు ముగింపు దశకు వచ్చాయి. వరి నాటిన 20, 25 రోజులకు యూరియా వేయాలి. లేదంటే నాటు పచ్చబడదు. పత్తికూడా పూత, కాత దశ లో ఉందన్నారు పత్తి మొక్కకు కొమ్మలు వచ్చే సమ యం ఇది. ఇటీవల వర్షాలు లేక పత్తి మొక్కలు వాడాయి. పత్తి మొక్కలకు కూడా కాంప్లెక్స్‌, యూరియా కలిపి వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తరణంలో 20 రోజులకు పైగా ఉమ్మడి జిల్లాల్లోని ఎరువుల దుకాణాల్లో యూరియా స్టాక్‌ లేదంటున్నారని మండిపడ్డారు. యూరియా అందరికీ అందేలా చూడాలని లేఖలో కోరారు.