రచ్చబండ కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు
తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నేడు కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రైతు రచ్చబండ కార్యక్రమం
పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్య క్రమానికి రేవంత్ రెడ్డిని వెళ్లకుండా పోలీసులు ఉదయం నుండే హైదరాబాద్ లోని ఆయన ఇంటిని ముట్టడించారు. కొద్దీ సేపటి క్రితం కార్యకర్తలు , నేతల తో ఎర్రవెల్లికి బయలుదేరగా..పోలీసులు భారీ బందోబస్తు నడుము రేవంత్ ను అరెస్ట్ చేసారు. ఈ క్రమంలో పోలీసులకు , కాంగ్రెస్ కార్యకర్తలకు తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల తీరు పట్ల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాష్ట్రంలో ఉన్న రైతులను అందరికీ వరి వేస్తే ఉరే అని చెప్పిన సీఎం కేసీఆర్ 150 ఎకరాల్లో వరి పండిస్తున్నారని రేవంత్ రెడ్డి నిన్న మీడియా తో అన్నారు. కాగ కేసీఆర్ వరి వేసిన పొలాన్ని ఈ రోజు జరిగే రచ్చబండ కార్యాక్రమంలో రాష్ట్ర ప్రజలకు చూపిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ తరుణంలో రేవంత్ ఇంటి దగ్గర అర్థరాత్రి నుంచే పోలీసులు పహారా కాశారు. రేవంత్ రెడ్డి బయటకు రాకుండా చూస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. రచ్చబండకు వెళ్తున్న పలువురి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. రచ్చబండ కార్యక్రమానికి జగిత్యాల నుంచి వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అడ్డుకుని గృహ నిర్భంధం చేశారు పోలీసులు. దుబ్బాకలో ఆరుగురు, భూపాలపల్లిలో ఐదుగురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధిపేటలో పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.