ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ బీభత్సం

రెమాల్‌ తుపాను ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఈ తుపాను ప్రభావంతో మిజోరంలో జరిగిన వివిధ ప్రమాదాల్లో 27 మంది మృతి చెందారు. ఐజ్వాల్లోని శివారు ప్రాంతంలో భారీ వర్షానికి ఓ రాతి క్వారీ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. 8 మంది ఆచూకీ దొరక్కపోవడం వల్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు హ్లిమెన్ వద్ద, కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక ఇళ్లు కూలిపోయాయి.

మిజోరంలో బుధవారం కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (IMD) వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. రాతి క్వారీ కూలిన ఘటనతో పాటు వర్షాల కారణంగా సంభవించిన విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం లాల్‌దుహోమా ప్రకటించారు. అలాగే రాష్ట్ర విపత్తు సహాయ నిధికి రూ.15 కోట్లు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో మిజోరంలో పాఠశాలలన్నింటికీ సెలవులు ప్రకటించారు. అత్యవసర సేవలు అందిస్తున్న వారు తప్ప మిగతా ఉద్యోగస్థులందరూ ఇంటి నుంచే పని చేయాలని మిజోరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.