క‌రెన్సీ నోట్ల‌పై ఠాగూర్‌, క‌లాం ఫొటోలు..వివ‌ర‌ణ ఇచ్చిన ఆర్బీఐ

అలాంటి ప్ర‌తిపాదనేది లేద‌ని వెల్ల‌డి

న్యూఢిల్లీ : క‌రెన్సీ నోట్ల‌పై మ‌హాత్మా గాంధీకి బ‌దులుగా ర‌వీంద్రనాథ్ ఠాగూర్‌, మాజీ రాష్ట్రప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం ఫొటోల‌తో కొత్త క‌రెన్సీ నోట్ల‌ను ముద్రించ‌నున్నట్లుగా వినిపిస్తున్న వార్త‌ల‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం కరెన్సీపై ఉన్న గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. భారతీయ కరెన్సీ నోట్లపై మార్పులు చేయాలని ఆర్‌బీఐ యోచిస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయని.. ఇలాంటి ప్రతిపాదనేదీ లేదని, ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ఉన్న కరెన్సీపై విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌తో పాటు మాజీ రాష్ట్రపతి, మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఫొటోలను కరెన్సీపై ముద్రించేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతుందన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ త్వరలోనే కీలకమైన ముందడుగు వేయవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న భారతీయ కరెన్సీ, నోట్లలో ఎలాంటి మార్పులు చేయాలనే ప్రతిపాదన ఏమీ లేదని, ఇలాంటివి కేవలం ఊహాగానాలేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/