రామాయంపేట తల్లికుమారుడి ఆత్మహత్య కేసులో లొంగిపోయిన నిందితులు

రామాయంపేట తల్లికుమారుడి ఆత్మహత్య కేసులో నిందితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి గంగు పద్మ, కుమారుడు గంగు సంతోష్ లు కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్దగల ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 18 నెలలుగా రామయంపేట్ మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పృథివిరాజ్,తోట కిరణ్, కన్నాపురం కృష్ణగౌడ్, స్వరాజ్ లతోపాటు గతంలో రామయంపేట్ సిఐ గా పనిచేసిన నాగర్జున గౌడ్ లు వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

చనిపోయేముందు సంతోష్, తల్లి పద్మలు సెల్ఫీ వీడియో ద్వారా తమ మృతికి ఏడుగురు వ్యక్తులు కారణమంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. మా చావుకు కారణమైన వారిని అందరూ చూస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి శిక్షించాలి’ అని వేడుకున్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అభియోగాలపై పోలీసులు అదే రోజు ఆ ఏడుగురిపై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

గత రెండు రోజులుగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా..ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న నిందితులు సీఐ నాగార్జున గౌడ్‌ మినహా ఆరుగురు నిందితులు కామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌ లొంగిపోయారు. పల్లె జితేందర్‌ గౌడ్‌, సరాఫ్‌ యాదగిరి, పృథ్వీ గౌడ్‌, తోట కిరణ్‌, కృష్ణా గౌడ్‌, సరాఫ్‌ స్వరాజ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు.