కొత్త సెక్రటేరియెట్ నిర్మాణ పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నూతన సచివాలయ ప్రాంగణానికి వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ త్వరితగతిన సెక్రటేరియట్ నిర్మానాన్ని పూర్తి చేయాలని సూచించారు. మంత్రుల ఛాంబర్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను కలియదిరిగి చూశారు. వెంటిలేషన్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ సరళిని పరిశీలించిన సీఎం, పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లర్స్, కాంక్రీట్ వాల్స్, స్టెయిర్ కేస్, డోర్స్, విండోస్ డిజైన్లు, వాటి నాణ్యతను సీఎం పరిశీలించారు. లిఫ్టులు, వాటి సంఖ్య, కెపాసిటీపై ఆరా తీశారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ స్టోన్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించి, స్టోన్ సప్లయ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టోన్ నిర్మాణంలో ప్రత్యేక డిజైన్లు అందంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. కొన్ని పిల్లర్ల డిజైన్లకు మార్పులు సూచించారు. సెక్రటేరియెట్ బిల్డింగ్ పరిసరాల్లో ఓపెన్ గ్రౌండ్ ఫిల్లింగ్ పనులు సమాంతరంగా జరిపించాలని, లాన్, ఫౌంటేన్ పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు.