శ్రీనగర్ లో భారీగా హిమపాతం కారణంగా జోడో యాత్ర ముగింపు సభకు ఆటంకం..

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈరోజు తో ముగుస్తుంది. ఈ క్రమంలో జోడోయాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లోని ఎస్‌కే స్టేడియంలో భారీ సభ కు ప్లాన్ చేసారు. ఈ సభకు డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన (ఉద్ధవ్‌ థాక్రే), సీపీఎం, సీపీఐ, వీసీకే, కేరళ కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, జేఎంఎం పార్టీల నేతలకు ఆహ్వానం పలికారు. సభ ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. ఈ లోపు కాశ్మీర్ లో సోమవారం రికార్డు స్థాయిలో మంచు కురిసింది. హిమపాతం ఎక్కువగా ఉండడంతో పలు విమానాలు రద్దయ్యాయి. భారీ ఎత్తున రోడ్లపై మంచు పేరుకు పోవడంతో శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారిని అధికారులు మూసేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాహుల్ జెండా ఎగరవేసి, అక్కడి నుంచి స్టేడియానికి ర్యాలీగా వెళ్లాలని ముందుగా నిర్ణయించారు. అయితే, మంచు ఎక్కువగా కురుస్తుండడంతో ర్యాలీ నిర్వహించడం సాధ్యం కాదేమోనని పార్టీ నేతలు సందేహిస్తున్నారు. మరోవైపు, జోడో యాత్ర ముగింపు సభకు వివిధ రాష్ట్రాలకు చెందిన 12 పార్టీల నేతలు హాజరుకానున్నారు. అయితే, జాతీయ రహదారి మూసేయడం, రోడ్లపై పేరుకుపోయిన మంచు కారణంగా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో సభకు వచ్చే నేతలకు ఇబ్బందులు తప్పకపోవచ్చని , కొంతమంది ప్రయాణాలు మానుకునే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు భావిస్తున్నారు.