ఢిల్లీ లిక్కర్ కేసు..వాంగ్మూలం వెనక్కి తీసుకున్న రామచంద్ర పిళ్లై

కవితకు బినామీనంటూ ఇంతకుముందు వాంగ్మూలం

ramachandra-pillai-filed-petition-on-his-statement-in-delhi-liquor-case

హైదరాబాద్‌ః ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు వ్యతిరేకంగా హైదరాబాదీ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై కోర్టును ఆశ్రయించారు. ఈడీకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని తెలిపాడు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో తన లాయర్ ద్వారా పిటిషన్ వేశాడు. దీంతో పిళ్లై పిటిషన్ పై స్పందించాలంటూ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.

లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన ధర్నా కోసం కవిత కూడా ఢిల్లీలోనే ఉన్నారు. శనివారం ఉదయం ఆమె ఈడీ ఆఫీసులో విచారణకు హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది.

ఎమ్మెల్సీ కవితకు తానే బినామీనంటూ ఈడీకి వాంగ్మూలం ఇచ్చిన రామచంద్ర పిళ్లై.. ఇప్పుడు మాటమార్చారు. తన వాంగ్మూలాన్ని వాపస్ తీసుకోవడానికి అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో శనివారం కవిత విచారణ ఏ మలుపు తీసుకోనుందనే ఉత్కంఠ నెలకొంది.