ఇక్కడ మహిళలకు అన్యాయం చేసి ఢిల్లీకి వెళ్లి దీక్ష చేయడమేంటిః బండి

ప్రభుత్వంలో ఎంతమందికి అవకాశం కల్పించారని నిలదీత

bandi-sanjay-speech-in-bjp-bharosa-deeksha

హైదరాబాద్‌ః బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మహిళలకు రాష్ట్రంలో, ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది మహిళలకు అవకాశం కల్పించారని ప్రశ్నించారు. తెలంగాణలో మహిళలకు కనీసం 3 శాతం రిజర్వేషన్లు కూడా అమలుచేయని బిఆర్ఎస్ పార్టీ ఈరోజు (శుక్రవారం) ఢిల్లీలో మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. రాష్ట్రంలో కవిత తప్ప మరొకరు రాజకీయంగా ఎదగకూడదనే ఉద్దేశంతో మహిళలను కేసీఆర్ సర్కారు అణచివేస్తోందని మండిపడ్డారు.

బిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను డిమాండ్ చేయాలని ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ హితవు పలికారు. కెసిఆర్ ప్రభుత్వమే మహిళల ఉసురుపోసుకుందని, పోలీసులతో వారిపై దాడి చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు పార్టీ తరఫున చేపట్టిన భరోసా దీక్షలో బండి సంజయ్ బిఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు.

మహిళల సంక్షేమానికి దేశంలో కట్టుబడి ఉన్న పార్టీ బిజెపి ఒక్కటేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీ తమదేనని చెప్పారు. కేంద్ర క్యాబినెట్ లో మహిళలకు సముచిత స్థానం కల్పించామని గుర్తుచేశారు. రాష్ట్రపతిగా, రాష్ట్రాలకు గవర్నర్లుగా మహిళలను ఎంపిక చేసిన పార్టీ బిజెపి అని వివరించారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే పలు పార్టీలు అడ్డుకున్నాయని వివరించారు.

అప్పుడు పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతులను చింపేసిన పార్టీ నేతలతో కలిసి ప్రస్తుతం కవిత దీక్ష చేస్తోందని ఆరోపించారు. అప్పుడు బిల్లు ప్రతిని చింపేసిన నేతలు ఇప్పుడు మద్దతు ఎలా తెలుపుతున్నారని, ముందు వాళ్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కవిత ఎక్కడ వెనకబడతారోనని బిఆర్ఎస్ పార్టీలో మహిళా నేతలను అణచివేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. మద్యం పాలసీ స్కామ్ లో తన పాత్రపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో దీక్ష చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.