త్రివిధ దళాలు ఉమ్మడిగా ప్రణాళికలు, కార్యకలాపాలు అమలు చేయాలిః రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: రెండు రోజులు పాటు జరిగే ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) కమాండర్ల కాన్ఫరెన్స్ను గురువారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైమానిక దళ టాప్ కమాండర్ల నుద్దేశించి రాజనాథ్ సింగ్ ప్రసంగించారు. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైమానిక దళ కమాండర్లకు పిలుపునిచ్చారు. వేగంగా మారుతున్న ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిస్థితులను పరిశీలించాలని తెలిపారు. భారత్ రక్షణపరంగా వాటిని అంచనా వేయాలని, ఆ మేరకు కార్యాచరణ సంసిద్ధతను పెంపొందించుకోవాలని అన్నారు. భారత వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంతోపాటు డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించాలని ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులకు సూచించారు.
కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ నేపథ్యంలో వివిధ వైమానిక వేదికల వినియోగాన్ని భారత్ ఎయిర్ఫోర్స్ కమాండర్లు విస్తృతంగా విశ్లేషిస్తున్నారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, గ్లోబల్ సెక్యూరిటీ దృష్ట్యా కొత్త సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. వాటిని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని భారత వైమానిక దళ కమాండర్లకు సూచించారు. త్రివిధ దళాలు ఉమ్మడిగా ప్రణాళికలు, కార్యకలాపాలు అమలు చేయాలన్నారు.
మరోవైపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, ఇతర కమాండర్లతో కలసి చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిని రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఎయిర్ఫోర్స్ డే పరేడ్, వైమానిక ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించినందుకు ఐఏఎఫ్ను అభినందించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో మానవతా సహాయం, విపత్తు సహాయ మిషన్లలో ఐఏఎఫ్ పాత్రను ప్రశంసించారు.