రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్‌.. 11 గంటలకు 24.74 పోలింగ్‌ శాతం

Rajasthan registers 24.74 pc voter turnout till 11.30 am, says EC

జైపూర్‌ః రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఉదయం 11:30 గంటల వరకు రాష్ట్రంలో 24.74 శాతం ఓటింగ్‌ నమోదైందని ఎలక్షన్‌ కమిషన్‌ తెలిపింది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

కాగా, రాష్ట్రంలోని మొత్తం 200 సీట్లకుగాను 199 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతున్నది. కరన్‌పూర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే గుర్మీత్‌ సింగ్‌ కూనార్‌ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదాపడింది. 199 స్థానాలకు గాను 1862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 5.25 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 1.71 కోట్ల మంది 18 నుంచి 30 ఏండ్ల వయస్సులోపు వారే కావడం విశేషం. ఈ సారి కొత్తగా 22.61 లక్షల మంది మొదటిసారి ఓటు వేస్తున్నారు. దీంతో పార్టీల భవితవ్యాని యువ ఓటర్లే నిర్ణయించనున్నారు.

59 మంది సిట్టింగ్‌లకు ప్రతిపక్ష బజెపి మరోసారి అవకాశం ఇవ్వగా, కాంగ్రెస్‌ పార్టీ 97 మంది ఎమ్మెల్యేలను మళ్లీ బరిలో నిలిపింది. పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే ఉన్నా.. సీపీఎం, ఆర్‌ఎల్‌పీ, భారత్‌ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్‌ పార్టీ, ఆప్‌, ఎంఐఎం కూడా బరిలో నిలిచాయి. కాంగ్రెస్‌, బిజెపిలకు 40 స్థానాల్లో రెబెల్స్‌ నుంచి పోటీ ఎదురవుతున్నది. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి.