తాము వద్దన్నాకే రాజగోపాల్ బీజేపీలో చేరారు – కేటీఆర్

రాజగోపాల్ రెడ్డి కి సంబదించిన కీలక విషయాలని మంత్రి కేటీఆర్ బయటపెట్టారు. ముందు రాజగోపాల్ టిఆర్ఎస్ లో చేరతానన్నాడని , తాము వద్దన్నాకే బీజేపీలో చేరారని తాజా ఇంటర్వ్యూ లో కేటీఆర్ తెలిపారు.

‘కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మూడేళ్లుగా తీవ్రంగా ప్రయత్నించారు. మా పార్టీ నేతలతోనే కాదు.. స్వయంగా నాతో కూడా మాట్లాడారు. ఆయన చేరిక విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. కేసీఆర్ వారిని పార్టీలో చేర్చుకోవడానికి నిరాకరించారు. కోమటిరెడ్డి సోదరులకు నిలకడ ఉండదు.. మాట మీద నిలబడే నేతలు కాదు. గతంలో వైఎస్సార్‌ను, జగన్‌ను మోసం చేశారు. వారిని మనం నమ్మలేం అని కేసీఆర్ చెప్పారు. అందుకే వారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదు’ అని కేటీఆర్ వెల్లడించారు.

అంతే కాదు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫై కూడా కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేసారు. సొంత నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక పార్టీలో ఉండి.. మరొక పార్టీ కోసం పనిచేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో.. ఈ వ్యవహారం చూస్తే అర్థం అవుతోందన్నారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.