ప్రయాణికుల రద్దీ.. 380 ప్రత్యేక రైళ్లు..రైల్వే మంత్రిత్వ శాఖ

దేశంలోని ప్రధాన కేంద్రాల మీదుగా 6,363 ట్రిప్పుల నిర్వహణకు నిర్ణయం

train
train

న్యూఢిల్లీః వేసవిలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. మొత్తం 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది. పాట్నా, ఢిల్లీ, విశాఖపట్నం, ముంబై వంటి ప్రధాన కేంద్రాల మీదుగా మొత్తం 6,363 రైళ్ల ట్రిప్పులు నిర్వహించేందుకు నిర్ణయించింది. రైల్వే శాఖ గతేడాది 348 ప్రత్యేక రైళ్లతో ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 4,599 ట్రిప్పులను నిర్వహించింది.

ఈ ఏడాది అదనంగా మరో 1,770 ట్రిప్పులను జోడించింది. ఈ ప్రత్యేక సర్వీసులు పాట్నా-యశ్వంత్‌పూర్, పాట్నా-సికింద్రాబాద్, విశాఖపట్నం-పూరీ-హావ్డా తదితర మార్గాల్లో నడపనున్నారు. ఇక దక్షిణ మధ్య రైల్వేలో గతేడాది 784 ట్రిప్పుల మేర ప్రత్యేక రైళ్లను నడిపారు. ఇది అంతకుమునుపు ఏడాది కంటే 80 ట్రిప్పులు అదనం.