నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం

బెంగళూరుః కర్ణాటకలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ , మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే కొత్త మంత్రివర్గంలో దళిత నేత, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, కేపీ ముణియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ కార్జిహోళి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ కు స్థానం కల్పిస్తారని, వారే నేడు గవర్నర్ సమక్షంలో మంత్రులుగా ప్రమాణం చేస్తారని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా, సిద్ధరామయ్య, శివకుమార్తోపాటు మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులంతా హజరవుతారని చెప్పారు. తానుకూడా ప్రస్తుతం అక్కడికే బయలుదేరానని ఢిల్లీలో విలేకరులతో అన్నారు. కర్ణాటకలో బలమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నదని వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రానికి లబ్ధిచేకూరుతుందని, దేశ రాజకీయాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.