వందేభారత్ స్లీపర్ కోచ్ ఫోటోలను విడుదల చేసిన రైల్వే శాఖ మంత్రి
న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వందేభారత్ ఎక్స్ప్రెస్ ఏసీ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో స్లీపర్ కోచ్లను తీసుకురాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే వెల్లడించింది కూడా.
ఇందులో భాగంగానే తాజాగా స్లీపర్ కోచ్లకు సంబంధించిన కొన్ని ఫొటోలను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా విడుదలు చేశారు. ఈ ఫొటోల్లో స్లీపర్ కోచ్లు ఎంతో రిచ్లుక్లో కనిపిస్తున్నాయి. రాత్రి పూట దూర ప్రయాణం చేసేవారికి అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా వీటిని తీర్చిదిద్దారు. ఇందులో ఇంటీరియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎంతో విలాసవంతంగా, లగ్జరీగా ఉన్న ఈ కోచ్లు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్లీపర్ కోచ్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.