తెలంగాణలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం – రాహుల్ ట్వీట్

తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుంది..రాష్ట్రంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అన్నాడు రాహుల్. వచ్చే నెలలో తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేపట్టింది. ములుగు లో ప్రారంభమైన ఈ యాత్ర మూడు రోజులుగా పలు జిల్లాలో సాగింది. ఈ మొదటి విడత యాత్ర లో రాహుల్ పాల్గొని నేతల్లో , కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

మొదటి విడత బస్సు యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా పవర్ ఫుల్ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుంది. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ రాష్ట్రానికి నాది గ్యారెంటీ’’ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఈ నెల 18న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ బస్సు యాత్రను ప్రారంభించారు. రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం యాత్రను చేపట్టారు. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగింది.