జనవరి 14 నుంచి ‘భారత్‌ న్యాయ యాత్ర’ను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ

14 రాష్ట్రాలు, 85 జిల్లాల గుండా కొనసాగి మార్చి 20 న ముంబయిలో ముగింపు

rahul-gandhi-to-launch-bharat-nyay-yatra-on-january-14

న్యూఢిల్లీః భారత్ జోడో యాత్రతో పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తాజాగా మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయ యాత్ర పేరుతో జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ‘మణిపూర్ నుంచి ముంబయి’ యాత్ర చేపట్టనున్నారు. ఈమేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర షెడ్యూల్ ను విడుదల చేసింది. జోడో యాత్రకు కొనసాగింపుగా చేపడుతున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ బస్సులో చేస్తారని వెల్లడించింది.

ఈ యాత్రలో భాగంగా మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలను రాహుల్ గాంధీ కవర్ చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతారని కాంగ్రెస్ పేర్కొంది. తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర చేపట్టాలన్న ప్రతిపాదనలపై పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చించి ఈ యాత్రకు రూపకల్పన చేసినట్లు తెలిపింది. ఈ యాత్రలో సుమారు 6,200 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపడతారని వివరించింది.