పేద ప్ర‌జ‌ల నుంచి అదానీ సొమ్ము దోచుకుంటున్నారు : రాహుల్ గాంధీ

Rahul Gandhi targets Adani group again on coal pricing issue

న్యూఢిల్లీ: వ్యాపార‌వేత్త అదానీ బొగ్గు కుంభ‌కోణానికి పాల్ప‌డుతున్న‌ట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అధిక క‌రెంటు ఛార్జీల‌ను వ‌సూల్ చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌కు చెందిన సుమారు 12 వేల కోట్ల డ‌బ్బును అదానీ జేబులోకి మ‌ళ్లించాల‌ని రాహుల్ కేంద్ర స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఫైనాన్షియ‌ల్ టైమ్స్ ప్ర‌చురించిన రిపోర్టుపై కామెంట్ చేశారు. అదానీ కోల్ స్కామ్ గురించి భార‌తీయ మీడియా ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. ఇండోనేషియా నుంచి అదానీ బొగ్గును కొనుగోలు చేస్తున్నార‌ని, ఆ బొగ్గు ఇండియాకు వ‌చ్చేలోగా, దాని ధ‌ర రెట్టింపు అవుతోంద‌ని, దీంతో మ‌న క‌రెంట్లు బిల్లులు కూడా పెరుగుత‌న్నాయ‌ని, పేద ప్ర‌జ‌ల నుంచి అదానీ సొమ్ము దోచుకుంటున్నార‌ని, ఫైనాన్షియ‌ల్ టైమ్స్‌లో వ‌చ్చిన క‌థ‌నంతో ఏ ప్ర‌భుత్వమైనా దిగిరావాల్సిందే అని, ప్ర‌జ‌ల నుంచి నేరుగా డ‌బ్బును వ‌సూల్ చేస్తున్న‌ట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసారి చోరీ ఏకంగా ప్ర‌జ‌ల జేబుల నుంచి నేరుగా సాగుతుంద‌ని, స్విచ్ కోసం బ‌ట‌న్ నొక్కితే, ఆ స‌మ‌యంలో అదానీ జేబుల్లోకి డ‌బ్బులు వెళ్తున్నాయ‌ని రాహుల్ తెలిపారు. అనేక దేశాల్లో అదానీపై ఎంక్వైరీ జ‌రుగుతోంద‌ని, కానీ ఇండియాలో మాత్రం ఆయ‌న‌పై ఎటువంటి చ‌ర్య‌లు లేవ‌ని రాహుల్ విమ‌ర్శించారు.