సిఏఏకు వ్యతిరేకంగా నిరసన.. కాల్పుల్లో ఇద్దరు మృతి

కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టానికి(సిఏఏ) వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్న నిరసనకారులపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపి, నాటు బాంబులు విసిరేయడంతో ఇద్దరు నిరసనకారులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో బుధవారం ఈ సంఘటన జరిగింది. మృతులను అనరుల్ బిశ్వాస్(55), సలావుద్దీన్ షేక్(17)గా గుర్తించారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రిలో చేర్చారు. బహుజన్ క్రాంతి మోర్చా ఇచ్చిన అఖిల భారత బంద్ పిలుపును పురస్కరించుకుని నిరసనలు జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సిఎఎని రద్దు చేయాలని కోరుతూ 20 రోజుల క్రితం ఏర్పడిన సిఎఎ విరోధి నాగరిక్ మంచ్ సభ్యులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండగా టిఎంసికి చెందిన జాలంగి బ్లాక్ అధ్యక్షుడు తోహిరుద్దీన్ మోండల్ తన అనుచరులతో కలసి వచ్చి నిరసనకారులపై కాల్పులు జరిపినట్లు ఇందాదుల్ హక్ అనే నిరసనకారుడు తెలిపారు. ఈ కాల్పులలో తోహిరుద్దీన్ సోదరుడు మాంటు మోండల్ కూడా గాయపడినట్లు ఆయన చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/