ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi reacts on the phone tapping case

న్యూఢిల్లీః దేశంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఫోన్‌ కంపెనీల నుంచి తమకు వార్నింగ్‌ మెజేస్‌లు వచ్చాయంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

దేశంలో విపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలు కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడా, సుప్రీయా శ్రీనాథ్‌లకు యాపిల్ కంపెనీ నుంచి హెచ్చరిక మెయిల్ వచ్చిందన్నారు. వీరితో పాటు ఎన్సీపీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్, ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా, సీపీఎం నేత సీతారాం ఏచూరీలకు సైతం వార్నింగ్ మెయిల్ వచ్చిందన్నారు. తన కార్యాలయంలోని చాలా మందికి ఇలాంటి సందేశాలు వచ్చినట్లు చెప్పారు.

హ్యాకింగ్‌కు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీని కాపాడేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్స్ అంటూ ధ్వజమెత్తారు. అయితే, ఫోన్ ట్యాపింగ్‌లకు తాము భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎంత ట్యాపింగ్‌ చేయాలనుకుంటే అంత చేసుకోవచ్చని అన్నారు. తన ఫోన్‌ కావాలన్నా ఇస్తానని.. ట్యాపింగ్‌ చేసుకోవచ్చంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి కేంద్రంలోని బిజెపి ఓర్వలేకపోతందన్నారు. అందుకే విపక్షాలను అనేక ఇబ్బందులకు గురి చేయాలని భావిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఫోన్‌ ట్యాపింగ్‌లకు పాల్పడుతోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

కాగా, ఈ ఉదయం విపక్ష ఎంపీలు తమ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఆరోపించిన విషయం తెలిసిందే. తృణ‌మూల్ ఎంపీ మ‌హువా మొయిత్రా, కాంగ్రెస్ నేతలు ప్రియాంకా చ‌తుర్వేది, శ‌శి థ‌రూర్‌, ప‌వ‌న్ ఖేరా, ఆప్ ఎంపీ రాఘ‌వ చ‌ద్దా, ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ .. త‌మ ఫోన్లు హ్యాక్ అవుతున్నట్లు తెలిపారు. ఫోన్ కంపెనీల నుంచి త‌మ‌కు వార్నింగ్ మెసేజ్‌లు వ‌చ్చిన‌ట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వంతో లింకున్నసైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ ఫోన్లను హ్యాక్ చేసే ప్రయ‌త్నం చేస్తున్నట్లు త‌మ‌కు మెసేజ్‌లు వ‌స్తున్నట్లు ఆ ఎంపీలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీల‌కు చెందిన ఐఫోన్లను హ్యాక‌ర్లు టార్గెట్ చేస్తున్నట్లు యాపిల్ సంస్థ కొంద‌రికి వార్నింగ్ మెసేజ్‌ల‌ను పంపింది.