బిఆర్ఎస్లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి
హైదరాబాద్ః తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార పార్టీలో టికెట్ దక్కని వారు కాంగ్రెస్, బిజెపి లలో చేరుతుండగా.. మరికొందరూ కాంగ్రెస్, బిజెపి నేతలు బిఆర్ఎస్ లో చేరుతున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ టికెట్ తనకు దక్కలేదని నాగం జనార్థన్ రెడ్డి, జూబ్లీహిల్స్ టికెట్ తనకు దక్కలేదని విష్ణువర్ధన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకీ ఇటీవలే రాజీనామా చేశారు. తాజాగా కెసిఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్థన్ రెడ్డిలతో పాటు కరీంనగర్ నేత జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ వీరితో పాటు వీరి అనుచరులకు గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగం జనార్దన్రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ హయాంలో ఓబులాపురం మైనింగ్ కుంభకోణంపై పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. బిజెపిలో కొంతకాలం పనిచేశారు. తరువాత ‘తెలంగాణ నగారా’ పార్టీని స్థాపించారు. ఆ తరువాత కాంగ్రెస్లో చేరారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు బిఆర్ఎస్లో చేరారు.