అందుకే జగదీశ్ కు బిజెపి టికెట్ ఇవ్వలేదుః రాహుల్ గాంధీ

rahul-gandhi-fires-on-bjp

న్యూఢిల్లీః బిజెపి సీనియర్ నేత, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం జగదీశ్ శెట్టార్ కు బిజెపి టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ఇతర బీజేపీ నేతల మాదిరి జగదీశ్ 40 శాతం కీషన్లు తీసుకోలేదని.. అందుకే ఆయనకు బిజెపి టికెట్ ఇవ్వలేదని అన్నారు. ఆయన అవినీతికి దూరంగా ఉన్నందువల్లే టికెట్ నిరాకరించారని విమర్శించారు. హవేరీ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపికి 40 కంటే ఎక్కువ సీట్లు ఇవ్వడం అనవసరమని చెప్పారు. కాంగ్రెస్ ను కనీసం 150 సీట్లతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

మైసూర్ శాండల్ సోప్ స్కామ్ లో ఒక బిజెపి ఎమ్మెల్యే కొడుకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారని రాహుల్ దుయ్యబట్టారు. పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ రిక్రూట్ మెంట్ స్కామ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కామ్, అసిస్టెంట్ ఇంజినీర్ జాబ్స్ స్కామ్ తదితర ఎన్నో స్కామ్ లు బిజెపి ప్రభుత్వంలో చోటుచేసుకున్నాయని చెప్పారు.