8 మంది భారతీయ అధికారులకు మరణ శిక్ష కేసు.. భారత్ అప్పీల్‌ను స్వీకరించిన ఖతర్‌ కోర్టు

గత నెలలో 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు కోర్టు మరణ శిక్ష

Qatar Accepts India’s Appeal Against Death Penalty To 8 Navy Veterans

న్యూఢిల్లీః ఖతర్‌లో గూఢచర్యం కేసులో భారత మాజీ నేవీ అధికారులకు మరణ శిక్షను సవాలు చేస్తూ భారత్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం స్థానిక న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. త్వరలో ఈ పిటిషన్‌పై విచారణ మొదలు కానుందని కోర్టు పేర్కొన్నట్టు భారత అధికారులు తెలిపారు. గత నెలలో ఎనిమిది మంది భారత నేవీ అధికారులకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. గతేడాదిగా వారు ఖతర్ జైల్లోనే మగ్గుతున్నారు.

ఈ కేసుకు సంబంధించి విదేశాంగ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. ‘‘ కోర్టు తీర్పు గోప్యంగా ఉంచారు. అయితే, ఈ కోర్టు తీర్పును మా లీగల్ టీంతో పంచుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని పరిశీలించాక అప్పీలు ఫైల్ చేశాం. ఖతరీ అధికారులతో టచ్‌లో ఉన్నాం’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.

ఖతర్‌ కంపెనీలో పనిచేస్తూ ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న నేరంపై అక్కడి అధికారులు గత ఆగస్టులో ఎనిమిది మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ నేవీ అధికారులు కెప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్త, సెయిలర్ రాగేశ్‌లను ఆగస్టు 30న ఖతర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అరెస్టు చేసింది. వారి బెయిల్ అభ్యర్థలను పలుమార్లు తోసిపుచ్చిన న్యాయస్థానం చివరకు మరణ శిక్ష విధించింది.