అటల్ స్ఫూర్తితో యువత పని చేయాలిః పురందేశ్వరి
బిజెపి కార్యాలయంలో వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమం
విజయవాడ: నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడలోని రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వాజ్ పేయి చిత్రపటానికి బిజెపి రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ సేవకు వాజ్ పేయి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. బిజెపిని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదేనని చెప్పారు. సుపరిపాలన అంటేనే వాజ్ పేయి గుర్తొస్తారని అన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించిన ధైర్యవంతుడని చెప్పారు. చిన్న వయసులోనే సామాజిక కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. అటల్ స్ఫూర్తితో యువత పని చేయాలని చెప్పారు. వాజ్ పేయి చూపిన మార్గంలో నడుస్తామని తెలిపారు.