తెలంగాణ లో పర్యటిస్తున్న పంజాబ్ సీఎం

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ నేడు తెలంగాణ లోని పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి గజ్వేల్ కి బయలుదేరారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. కాళేశ్వరం నుంచి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ ఉన్నదని, 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. ఇది 2,85,280 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని వివరించారు. అనంతరం కొండపోచమ్మ సాగర్‌ పంప్‌ హౌస్‌ను, తొగుటలోని మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ సందర్శించనున్నారు.

అలాగే మర్ముక్ పంప్ హౌస్, పాండవుల చెరువును ఆయన పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాజెక్టు వల్ల భూగర్భజలాల పెరుగుదల, మిషన్ కాకతీయ గురించి పంజాబ్ సీఎం బృందానికి అధికారులు తెలియజేయనున్నారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్ ల నిర్మాణం తదితర పనులను అధ్యయనం చేయనున్నారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగిరానున్నారు..