కెసిఆర్ ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తున్నారు… ఇలాంటి సీఎం మనకు అవరసమా?: ప్రియాంకాగాంధీ

రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని వ్యాఖ్య

priyanka-gandhi-road-show-in- Zaheerabad

జహీరాబాద్ః సిఎం కెసిఆర్‌ ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తున్నారని… ఇలాంటి సీఎం మనకు అవరసమా? అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ అన్నారు. బిఆర్ఎస్ వంటి అవినీతి ప్రభుత్వం మనకు అవసరమా? అని అడిగారు. ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని విమర్శించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదని… కెసిఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. ధరణి పోర్టల్ తో భూములను లాగేసుకున్నారని ఆరోపించారు. జహీరాబాద్ లో ప్రియాంక రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని ప్రియాంక అన్నారు. కెసిఆర్ కు బైబై చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని… తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. బిజెపి, బిఆర్ఎస్ రెండూ ఒకటేనని అన్నారు. బిఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ అని… అంత డబ్బు ఆ పార్టీకి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడి సంపాదించుకున్నారని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. అదానీ, అంబానీలకు బిజెపి కొమ్ముకాస్తోందని విమర్శించారు. తెలంగాణలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయానని ప్రియాంక అన్నారు. ఉద్యోగ పరీక్షల పేపర్లను కూడా లీక్ చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఎంతో బాధలో ఉన్నారని చెప్పారు. బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎంలు పరస్పరం సహకరించుకుంటున్నాయని దుయ్యబట్టారు.