మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ

రాష్ట్రపతి భవన్‌లో మరికాసేపట్లో ఎన్టీఆర్ నాణేన్ని ఆవిష్కరించబోతున్నారు. ఎన్టీఆర్ చిత్రంతో రూపొందించిన రూ.100 నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం హాజరుకానున్నారు. అలాగే ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. పాదయాత్రలో ఉన్నందున లోకేష్ హాజరు కావడం లేదు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది.