ప్రీతీ ఆత్మహత్య యత్నం కేసు : నిందితుడ్ని ఖమ్మం జైలు కు తరలింపు

కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమెకు నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. ఈమె ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి కారకుడైన సైఫ్ ను పోలీసులు హనుమకొండ జిల్లా వరంగల్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించారు.

సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు. నిందితుడు సైఫే అనే మొదటి నుంచీ ప్రీతి తండ్రి నరేందర్ వాదిస్తుండగా.. సైఫ్ గత నాలుగు నెలలుగా ప్రీతిని వేధించినట్లు సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టి ప్రీతిని అవమానించాడని చెప్పారు. గ్రూప్ లలో మెసేజ్ లు పెట్టి వేధించొద్దని ప్రీతి వేడుకున్నా సైఫ్ వినలేదన్నారు. బ్రెయిన్‌ లేదంటూ సైఫ్‌ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని ప్రీతి ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. సైఫ్ వేధింపులు తట్టుకోలేకే ప్రీతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని పోలీసులు తేల్చారు.

ఇక ప్రీతి ఆరోగ్యం పై నిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రీతి ఆరోగ్యం ఇంకా క్రిటికల్‭గానే ఉందని చెప్పారు. ఎక్మో, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ చేస్తున్నామని.. ప్రీతి ఇస్తున్న ట్రీట్మెంట్, హెల్త్ కండీషన్ పై మల్టీ డిపార్ట్మెంట్‭లకు చెందిన వైద్యులు మానిటరింగ్ చేస్తున్నట్లు హెల్త్ బులిటెన్‭లో వెల్లడించారు.