భక్తులకు ఆహ్వానం..భాగ్య నగరంలో శ్రీరామ చంద్రుని ప్రాణ ప్రతిష్ఠ విజయ్ దివస్ ఉత్సవాలు

అభిషేక్ గౌడ్ నేతృత్వంలో కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) విశేష కార్యక్రమాలు

Prana Pratishtha Vijay Divas celebrations of Sri Rama Chandra in Hyderabad

హైదరాబాద్‌ః యావత్ ప్రపంచం అయోధ్య వైపు చూస్తోంది. హిందూ ప్రపంచం పండుగగా భావిస్తున్న అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని భాగ్యనగరం నడిబొడ్డన చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) నిర్ణయించింది. పరిషత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్, కార్యదర్శి సాయిరామ్ యాదవ్, ఉపాధ్యక్షులు అనిష్ గౌడ్, కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ,కార్యదర్శి అశోక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమ వివరాలను పరిషత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్ వివరించారు. హిందూ ఐక్యత చాటేలా..హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) ఆధ్వర్యంలో ఈ నెల 22న హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహాం పక్కన, ప్రసాద్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ కార్యక్రమానికి నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. 22న మధ్నాహ్నం 4 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. శ్రీరామ్ పూజతో కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా భారీగా తరలి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అభిషేక్ గౌడ్ వివరించారు. భక్తులను పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిలిచిపోయేలా గణేష్, శ్రీరామ్, హనుమాన్ కీర్తనలు, పాటలతో భక్తిలహరి ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. అదే సమయంలో దేశం మొత్తం శ్రీరామ నామంతో తరిస్తున్న వేళ డాన్స్ ఆర్టిస్ట్ తో స్క్రీన్ పైన శ్రీరామచరిత్ర ప్రదర్శనకు నిర్ణయించామన్నారు. ప్రపంచం మొత్తం ఈ నెల 22న అయోధ్య వైపు చూస్తోందని..ఇది యావత్ భారతావనికే గర్వకారణమని అభిషేక్ గౌడ్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా అయోధ్య ప్రత్యేకత, విశిష్ఠత వివరిస్తూ ఆకట్టుకొనే డాక్యుమెంటరీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదే విధంగా మహాభారతం, పూరీ జగన్నాధ్ శాండ్ ఆర్టిస్ట్ షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అశేష సంఖ్యలో హాజరయ్యే భక్తులను ఉద్దేశించి ఆల్ ఇండియా కృష్ణ ధర్మపరిషత్ నిర్వాహకుల ప్రసంగాలతో పాటుగా ముఖ్య అతిధి డాక్టర్ కే లక్ష్మణ్ సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు. కోట్లాది మంది హిందూ భక్త జనం రామ నామంతో దేశం అంతా ఐక్యంగా నిలిచే ఈ అరుదైన, చారిత్రక సమయం వేళ భాగ్యనగరిలో కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని అభిషేక్ గౌడ్ పిలుపునిచ్చారు. దేశం మొత్తం రమ్యమైన రామనామంతో పులకరించే ఈ అరుదైన చారిత్రక ఘట్టంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.