నేటి నుంచి ప్రజాగోస – బీజేపీ భరోసా ర్యాలీ స్టార్ట్

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయడంఖా మోగించాలని కసరత్తులు చేస్తున్న బిజెపి..‘పల్లె గోస… బీజేపీ భరోసా’ పేరుతో ఈరోజు నుండి తెలంగాణ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై బైక్ ర్యాలీలు చేపట్టబోతుంది. సిద్దిపేటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ ర్యాలీని ప్రారంభిస్తారు. అనంతరం వేములవాడలో నిర్వహించే బైక్‌ర్యాలీ లోనూ సంజయ్‌ పాల్గొంటారు. తొలివిడతలో వేములవాడ, సిద్దిపేట, బోధన్‌, నర్సంపేట, జుక్కల్‌, తాండూరు నియోజకవర్గాల్లో బైక్ యాత్రలు ఉంటాయి. ఎల్లుండి నుంచి మరో 8 స్థానాల్లో బైక్‌ ర్యాలీలకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఈ ర్యాలీలకు తాండూరులో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సిద్దిపేటలో పార్టీ మధ్యప్రదేశ్‌ ఇంచార్జి మురళీధర్‌రావు, జుక్కల్‌లో జాతీయ కార్యవర్గ సభ్యుడు డా.వివేక్‌ వెంకటస్వామి, బోధన్‌లో బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్, నర్సంపేటలో పార్టీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, వేములవాడలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నేతృత్వం వహిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, బైక్‌ ర్యాలీ ఇంచార్జి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అప్రజాస్వామిక, నియంత, కుటుంబపాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు కోరుతూ 6359199199 మొబైల్‌ నంబర్‌ ఏర్పాటు చేశామన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకున్న వారు ఈ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని కోరారు.