నేడు వైసీపీలో చేరనున్న పోతిన మహేష్

విజయవాడ వెస్ట్ జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేశ్.. రెండురోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసారు. మరికాసేపట్లో అయన వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్‌ సైట్‌ వరకు భారీ ర్యాలీ తో బయలుదేరనున్నారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో జగన్‌ క్యాంప్‌ సైట్‌కి ర్యాలీగా వెళ్లి.. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్.. పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సింహంలా సింగిల్‌గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే తన పయనం ఉంటుందన్నారు పోతిన. జెండాకూలీలా బతకడం తన వల్ల కాదని.. వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలిసి పనిచేస్తానని పోతిన మహేష్ ప్రకటించారు.