నాపై ఐటీ దాడులు జరగొచ్చు : పొంగులేటి శ్రీనివాస్

ponguleti-srinivasa-reddy-comments-on-it-raids

హైదరాబాద్‌ః కొద్ది రోజుల్లోనే తనపై, తన కుటుంబ సభ్యులపై ఐటీ దాడులు జరుగుతాయని కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులకు కొద్ది రోజులు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు బిఆర్ఎస్​కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బిజెపి, బిఆర్ఎస్​ కుమ్మక్కై తన మీద ఐటీ దాడులు చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు.

‘ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరితే బిజెపి, బిఆర్ఎస్​ ఇబ్బందులు పెడతారని ముందే ఊహించాను. కాంగ్రెస్‌ పార్టీ సెక్యులర్‌ పార్టీ… అందుకే కాంగ్రెస్‌లో చేరాను. కెసిఆర్ అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో లీకులు జరిగాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలే నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. బిఆర్ఎస్, బిజెపిలు ఒకటే.. రెండు పార్టీలు గల్లీలో కొట్టుకుంటూ కనిపించినా.. ఢిల్లీలో కలిసిపోతాయి.’ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.