కోనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌

Polling is the first phase of the ongoing Lok Sabha elections

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులుతీరారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడుతల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దశలోనే అత్యధిక స్థానాల్లో పోలింగ్‌ జరుగుతున్నది. తొలి విడుతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుండగా, 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు ఉండగా, 134 మంది మహిళా అభ్యర్థులు. 16.63 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 8.4 కోట్ల మంది ఉండగా, మహిళలు 8.23 కోట్ల మంది. 35.67 లక్ష మంది తొలిసారిగా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.

వీరికోసం 1.87 లక్షల పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. తొలిదశలో 8 మంది కేంద్రమంత్రులు, ఓ మాజీ గవర్నర్‌ పోటీలో ఉన్నారు. లోక్‌సభ స్థానాలతోపాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా నేడే పోలింగ్‌ జరుగుతున్నది.

మొదటి విడుతలో అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, రాజస్థాన్‌, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్ఛిమ బెంగాల్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులతో సహా కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి లలో ఎన్నికలు జరుగుతున్నాయి.

తమిళనాడు-39, రాజస్థాన్‌-12, ఉత్తర్‌ప్రదేశ్‌-8, మధ్యప్రదేశ్‌-6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్‌-5 చొప్పున, బీహార్‌-4, పశ్చిమ బెంగాల్‌-3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయలో- 2 చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్ముకశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో 1 స్థానం చొప్పున ఉన్నాయి.