చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ను ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబుకు పర్యటనకు అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా సభలు నిర్వహించినా, అందులో పాల్గొన్నా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు పలమనేరు డీఎస్పీ నోటీసులు జారీ చేశారు.

మూడు రోజుల కుప్పం పర్యటన కు గాను చంద్రబాబు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఈరోజు ఉదయం శంషాబాద్ నుండి బెంగళూరు ఎయిర్ పోర్టు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2.30 గంటలకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామం చేరుకోవాలని , రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించాలని అనుకున్నారు. రేపు కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలని, రాత్రికి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేయాలనీ, ఈ నెల 6న గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించాలని అనుకున్నారు. దీనికి తగ్గట్లే షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. కానీ ఇటీవల చంద్రబాబు నిర్వహించిన కందుకూరు , గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది మరణించారు. దీంతో హోమ్ శాఖ రాష్ట్రంలో ఎలాంటి ర్యాలీ లు , సభలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.

ఈ క్రమంలో ఈరోజు చంద్రబాబు కుప్పం పర్యటన ను పోలీసులు అడ్డుకుంటున్నారు. పలమనేరు జాతీయ రహదారిపై టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కుప్పంలో పోలీసులు చంద్రబాబు సమావేశానికి వెళ్లే ప్రచార రథంని అపేశారు. శాంతిపురం వెళ్లాల్సిన ప్రచార రథం, సౌండ్ వాహనాలు నిలిపివేశారు. ప్రచార రథం, సౌండ్ వాహనాలను గుడిపల్లి పీఎస్ తరలించారు. వాహన డ్రైవర్లు, సహాయక సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. శాంతిపురం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా ప్రచార రథాన్ని సిద్ధం చేయటానికి శుభ్రం చేస్తున్న క్రమంలో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.