బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు పోలీసులు షాక్
బండి సంజయ్ ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు షాక్ ఇచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాల్గు విడతల్లో రాష్ట్రంలోని పలు ఏరియాల్లో పాదయాత్ర చేపట్టిన సంజయ్..ఇప్పుడు ఐదో విడుత యాత్రకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి భైంసాలో యాత్ర మొదలుపెట్టాలని సంజయ్ భావించారు. అయితే భైంసా సున్నితమైన ప్రాంతం కాబట్టి యాత్రతో పాటు.. బహిరంగసభకు అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు స్పష్టం చేసారు.
అయితే పాదయాత్ర కోసం బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ నుంచి భైంసాకు బయలుదేరారు. రేపు జరిగే సభ కోసం ఇప్పటికే బీజేపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి నిమిషంలో పర్మిషన్ లేదని చెప్పడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భైంసా నుండి కరీంనగర్ వరకు 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కొనసాగనుంది. డిసెంబర్ 17న కరీంనగర్ జిల్లాలో ఈ యాత్ర ముగియనుంది.