బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఐటీ రైడ్స్ ఉండవు – మంత్రి మల్లారెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఐటీ రైడ్స్ ఉండవన్నారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణ లో గత కొద్దీ రోజులుగా ఐటి, ఈడీ రైడ్స్ రాజకీయ నేతలను, బిజినెస్ ప్రముఖులను నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ నేతలను టార్గెట్ గా వరుసపెట్టి దాడులు జరుగుతుండడంతో దీని వెనుక కేంద్ర హస్తం ఉందని ఆరోపిస్తుంది. రీసెంట్ గా మంత్రి మల్లారెడ్డి ఇళ్ల ఫై , ఆఫీసులపై అలాగే ఆయనకు సంబదించిన బంధువుల ఇళ్లపై కూడా పెద్ద ఎత్తున దాడులు జరిపి భారీగా నగదు , కీలక పత్రాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారాయి.

ఇదిలా ఉంటె మంత్రి మల్లారెడ్డి ఐటీ రైడ్స్ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ బహిలంపూర్లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఐటీ రైడ్స్ ఉండవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రతీ ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. సంపాదించుకున్న వాళ్లు సొంతంగా ట్యాక్స్ చెల్లించే విధంగా సీఎం కేసీఆర్ రూల్స్ తెస్తారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ తన వెంట ఉన్నంత వరకు ఏ రైడ్స్కూ భయపడనని మల్లారెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజలు రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మార్పు కోసం దేశ ప్రజలు, మేధావులు ఆలోచన చేస్తున్నారని.. 2024లో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.