బాన్సువాడలో నామినేషన్ దాఖలు చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

తాను నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్నానన్న పోచారం

Pocharam Srinivas Reddy files nomination in Banswada

హైదరాబాద్‌ః స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం బాన్సువాడ బిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అంబాసిడర్ కారులో బాన్సువాడ రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకొని, తొలి సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్నానన్నారు. అందుకే 1994 నుంచి ఒకసారి మినహాయించి ప్రతి ఎన్నికల్లో విజయాలు సాధించినట్లు చెప్పారు. తనపై ప్రజలకు ఉన్న అభిమానం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఏడు గంటల కరెంట్‌ హామీని కూడా నెరవేర్చడం లేదన్నారు.

మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణమని చెప్పి, కానీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత బస్సులను బంద్‌ చేశారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. బిఆర్‌ఎస్ ఆమోదయోగ్యమైన, అమలు చేయదగిన మ్యానిఫెస్టో అన్నారు. బిఆర్‌ఎస్‌కు చాలా స్థానాల్లో పోటీయే లేదని సర్వేలు చెబుతున్నాయన్నారు. బిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, కెసిఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారన్నారు.