ప్రపంచం మొత్తం భారత్వైపు చూస్తోందిః ప్రధాని మోడీ
న్యూఢిల్లీః బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పార్లమెంటుకు మోడీ చేరుకొని మీడియాతో మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి మోడీ అన్నారు. ‘‘విపక్షాలు తమ అభిప్రాయాలు సభలో వ్యక్తపరచాలి. ప్రపంచం మొత్తం భారత్వైపు చూస్తోంది. రాష్ట్రపతి, ఆర్థికమంత్రి ఇద్దరూ మహిళలే. భారత్ బడ్జెట్పై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది’’ అని మోడీ వ్యాఖ్యానించారు.
భారత రాష్ట్రపతి ముర్ము మొదటిసారి పార్లమెంట్ లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘ఇది భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం. ఆదివాసీలకు, మహిళకు ఇచ్చే గౌరవం’ అని అన్నారు. పార్లమెంటులో నూతన సభ్యుడు ఎవరైనామాట్లాడాలనుకుంటే వారిని ప్రోత్సహిస్తుందన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నానని చెప్పారు. ‘ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్’ అనే కాన్సెఫ్ట్ ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. విపక్ష సభ్యులు అన్ని అంశాలపై పార్లమెంట్ లో లేవనెత్తెందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అన్ని అంశాలపై సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
కాసేపట్లో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రసంగించనున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుంచనున్నారు.