‘నో యువర్ లీడర్’ కార్యక్రమంలో యువతతో ప్రధాని మోడీ సంభాషణ
న్యూఢిల్లీః పరాక్రమ్ దివస్ సందర్భంగా పార్లమెంటులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువతీ, యువకులతో ప్రత్యేకంగా సంభాషించారు. నో యువర్ లీడర్ (Know Your Leader) కార్యక్రమానికి ఎంపికైన 81 మంది యువతీ, యువకులతో ప్రధాని మోడీ.. ఆయన నివాసంలో మాట్లాడి.. పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. యువతీ, యువకులతో జరిపిన సంభాషణలో ప్రధానమంత్రి మోడీ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంలోని వివిధ అంశాలను, ఆయన నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనే విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా మోడీ యువతకు ఓ సలహా కూడా ఇచ్చారు. తమ జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో, ఆ సవాళ్లను ఎలా అధిగమించారో తెలుసుకోవడానికి చారిత్రక వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని మోడీ సూచించారు. గొప్ప వ్యక్తుల జీవితంపై అవగాహనతో ఉండాలని సూచించారు.
అదే సమయంలో, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో యువతీ, యువకులు ప్రధానికి చెప్పారు. ఈ కార్యక్రమానికి అవకాశం కోసం దేశంలోని నలుమూలల నుంచి ఎంతో మంది హాజరయ్యారని.. కొంతమందికే ప్రధానితో సంభాషించే అవకాశం లభించిందని తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూర్చునే అపూర్వ అవకాశం, ప్రధానిని కలిసే అవకాశం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ యువతీ, యువకులు ప్రధానితో పంచుకున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/telangana/