మదనపల్లె పట్టణంలో దారుణ ఘటన : యువకుడి ఫై పెట్రోల్ దాడి

అన్నమయ్య జిల్లా మదనపల్లె లో దారుణం చోటుచేసుకుంది. అల్తాఫ్(19) అనే యువకుడిపై ముగ్గురు యువకులు పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన నగరంలో సంచలనంగా మారింది. సోమవారం అల్తాఫ్ ఇంటి నుంచి బయటకు వస్తుండగా పల్సర్ బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు అతన్ని అడ్డుకొని , బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని పట్టణ సమీపంలోని నవోదయ పాఠశాల సమీప ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అందరూ చూస్తుండగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.

వెంటనే స్థానికులు వారిని పట్టుకోవడానికి యత్నించగా పారిపోయారు. మంటలను అదుపు చేసి తీవ్రంగా గాయపడిన బాధితుడిని 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడికి ప్రాణాపాయం ఏమిలేదని డాక్టర్స్ తెలిపారు.బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆల్తాఫ్‌ను డీఎస్పీ పరామర్శించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.