ఇది విరామమే. శుభం కార్డు ముందుంది : మంత్రి ‘పెద్దిరెడ్డి ‘
మూడు రాజధానుల చట్టాన్ని జగన్ సర్కార్ వెనక్కు తీసుకోవడంపై ఏపీ వ్యాప్తంగా అంత సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్నీ జగన్ స్వయంగా ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని.. ముందుంది అసలు సినిమా అంటూ… పేర్కొన్నారు. తాను ఇప్పటికీ మూడు రాజధానుల కే కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. ఉపసంహరణ అమరావతి రైతుల విజయం కాదని, పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని చెప్పారు పెద్దిరెడ్డి. తాను కేబినెట్ మీటింగ్ లో పాల్గొనలేదు. కాబట్టి పూర్తిగా వివరాలు తెలియవన్నారు. అసలు రాజధాని కోసం పాదయాత్ర చేసేది టిడిపి పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయం ఇంకా తీసుకోలేదు అని పేర్కొన్నారు.
జగన్ సర్కార్ ఎప్పుడైతే మూడు రాజధానులను ప్రకటించిందో..అప్పటి నుండి అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు. దాదాపు 700 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో మూడు రాజధానుల చట్టాలను ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఏపీ అడ్వకేట్ జనరల్ సోమవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఏజీ ప్రతిపాదనను విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు నిర్ణయాల్ని ఏపీ కేబినెట్ వెనక్కి తీసుకుంది. సీఎం జగన్ కాసేపట్లో అసెంబ్లీలో మూడు రాజధానుల నిర్ణయం గురించి ప్రకటన చేయనున్నారు.