కాగజ్నగర్లో పెను ప్రమాదం తప్పింది.. పెద్దవాగు బ్రిడ్జి కూలింది
కుమ్రం భీమ్ జిల్లా కాగజ్నగర్ మండలం అందెవెళ్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. అందెవెళ్లి వద్ద పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. బుధువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పినట్లయింది. గతేడాది కురిసిన వానలకు వంతెన కొద్దిగా కుంగిపోయింది. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు పెద్దవాగులో వరద ప్రవాహం పెరిగింది.
దీంతో వరద తాకిడికి బుధవారం తెల్లవారుజామన బ్రిడ్జి కూలిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. రహదారికి అడ్డంగా రెండువైపులు బారికేడ్లు పెట్టారు. ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో గత కొంత కాలంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల వంతెనపై నుంచి కూడా నీరు ప్రవహిస్తుంది. దీంతో పురాతన వంతెనలు కుంగడం , కూలిపోవడం జరుగుతున్నాయి.