ప్రధాని మోడీని చూసి దేశమంతా గర్విస్తోందిః షారుఖ్ ఖాన్

జీ20 సదస్సు విజయవంతం చేశారన్నబాలీవుడ్ బాద్ షా

Shah Rukh Khan congratulates PM Narendra Modi for G20 Summit in India

ముంబయిః దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 దేశాల సదస్సుపై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ స్పందించారు. సదస్సును విజయవంతం చేశారని ప్రధాని మోడీకి అభినందనలు తెలిపారు. జీ20 సదస్సుకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ ట్విట్టర్ లో మోడీకి కంగ్రాట్స్ చెప్పారు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోందని షారుఖ్ ఖాన్ అన్నారు.

జీ20 సదస్సుకు నాయకత్వం వహించడం, దేశాల మధ్య ఐక్యత కోసం పాటుపడడం దేశానికే గర్వకారణమని అన్నారు. ‘మోడీ సర్.. మీ నాయకత్వంలో దేశంలో ఐకమత్యం వెల్లివిరిస్తుంది. ఒకే దేశం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుగా ముందుకు వెళుతుంది’ అంటూ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశారు.

కాగా, షారుఖ్ ఖాన్ తాజా చిత్రం జవాన్ థియేటర్లలో కనకవర్షం కురిపిస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన జవాన్ సినిమా నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.500 కోట్లు రాబట్టిందని సినీవర్గాల సమాచారం. ఈ సినిమాను రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించగా.. డ్యూయల్ రోల్ లో నటించి అభిమానులను షారుఖ్ ఖాన్ మెప్పించారు.