యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా అంటూ పవన్ ఫై మంత్రి కారుమూరి ఫైర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ నేతలు మాటల యుద్ధం చేస్తున్నారు. నిన్న మంగళగిరి పవన్ చేసిన వ్యాఖ్యలపై వైస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసపెట్టి నేతలు మీడియా సమావేశాలు ఏర్పటు చేసి ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే చాలామంది వారి స్పందనను తెలియజేయగా.. బుధువారం ఉదయం ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కాల్ షీట్ ముగిసిపోయిందని, అందుకే పవన్ కళ్యాణ్ మళ్లీ హైదరాబాద్ వెళ్లారు అంటూ ఎద్దేవా చేశారు. తంతా కొడతా అంటూ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్న పవన్ జన సైనికులకు ఏం సందేశం ఇస్తున్నారని మంత్రి కారుమూరి ప్రశ్నించారు. విశాఖ గర్జనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్న ఆయన, జనసైనికులు విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడితే, మంత్రి రోజా వెంట్రుకవాసిలో దాడి నుండి తప్పించుకున్నారని మంత్రి కారుమూరి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా అని ప్రశ్నించిన మంత్రి కారుమూరి, యువతకు నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి, దాడులు చేయమని రెచ్చగొడతారా అంటూ పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నోటికొచ్చింది మాట్లాడితే తాట తీస్తా అని హెచ్చరించారు.